వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, తూకాల్లో మోసాలకు నిరసనగా జైపూర్ మండలంలోని ఇందారం వద్ద రైతులు శనివారం జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
కల్లాల్లో నెలరోజులుగా పేరుకుపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందారం, రామారావుపేట, టేకుమట్ల గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. "ధాన్యం వెంటనే కొనాలి", "తూకాల్లో మోసం ఆపాలి" అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బస్తాకు 41 కిలోల తూకం వేయాల్సి ఉండగా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, దళారులు కుమ్మక్కై 43 కిలోల వరకు తూకం వేస్తున్నారని, ప్రతి బస్తాకు అదనంగా రెండు కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని రైతులు ఆరోపించారు. అలాగే ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ సమయంలో హమాలీ చార్జీలను కూడా రైతుల నుంచే వసూలు చేస్తున్నారని తెలిపారు.
రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై లారీలు, బస్సులు, కార్లు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవల వాహనాలు కూడా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జైపూర్ సీఐ నవీన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ హామీతో రైతులు రాస్తారోకోను విరమించారు.


