నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో మద్యానికి బానిసై, కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
యాకర్పల్లి గ్రామానికి చెందిన శనిగరపు లక్ష్మణ్ (40) తరచూ మద్యం సేవించి, సరిగా పని చేయకుండా తిరుగుతుండటంతో భార్యతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మణ్, రాత్రికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. వెతుకులాటలో భాగంగా ఈరోజు ఉదయం వంజర్ గ్రామ శివారులోని మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.








