Mancherial/Hajipur (అక్షరవేకువ) ఆగస్టు 02
హాజీపూర్ మండలం రాపల్లి స్టేజి సమీపంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న హాజీపూర్ గ్రామానికి చెందిన ఆసాది లింగయ్య (55) అనే వ్యక్తి, ఆటోలో నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హాజీపూర్ మండలం రాపల్లి స్టేజి సమీపంలో శనివారం ఆటోలో నుంచి ఆర్టీసీ బస్సు కింద దూకి హాజీపూర్ కు చెందిన ఆసాది లింగయ్య (55) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, స్థానికుల కథనం ప్రకారం, లింగయ్య ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని మీద హాజీపూర్ నుంచి మంచిర్యాలకు ఆటోలో వెళుతుండగా, రాపల్లి స్టేజి సమీపంలోకి రాగానే ఎదురుగా మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును గమనించాడు. బస్సు ఆటో సమీపంలోకి రాగానే, అకస్మాత్తుగా ఆటోలో నుంచి ఎదురుగా వస్తున్న బస్సు కిందకు నేరుగా దూకాడు. ఆటోలోని ప్రయాణికులు స్పందించే లోపే బస్సు లింగయ్య తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
లింగయ్య కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి భార్య జయశీల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై హాజీపూర్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ, వారు ప్రమాద వివరాలు తెలుసుకొని విచారణ చేపట్టారు.












